పుట్ట మధు పై సంచలన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకురాలు!…..
దర్వాజ: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మీడియా ముందు ఆరోపణలు చేయడం… తాజాగా పుట్ట మధు లక్ష్యంగా విమర్శలు చేయడం కలకలం సృష్టిస్తోంది…జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన అనుచరుడు పూదరి సత్యనారాయణల బారి నుండి తనను కాపాడాలని పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు ఆరెల్లి దేవక్క కొమురయ్య వేడుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్టాడుతూ… మండలం మొత్తం పూదరి సత్యనారాయణ గుప్పిట పెట్టుకుని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమపైకి ఉసిగొల్పుతున్నారన్నారు. కొత్త కొత్త ఆదేశాలు ఇప్పిస్తూ తనను ఇరుకున పెడుతున్నారని, కావాలని చెక్ బౌన్స్ కేసు పెట్టించారని మండిపడ్డారు. తన సొంత పత్రికలో బూతు రాతలు రాస్తూ మహిళా సమాజం తలదించుకునే పదాలను ఉపయోగించారని దేవక్క ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ మహిళా నాయకురాలినని కూడా చూడకుండా కక్ష్య సాధింపులకు గురి చేస్తున్నారని, చెక్ బౌన్స్ కేసు విషయంలో జడ్పీ ఆఫీసులో మాట్లాడుకుందామని పిలిపించుకుని ఇష్టారీతిన దూషించాడని ఆరోపించారు.